bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
/
Matthew 26
Matthew 26
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
← Chapter 25
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 27 →
1
యేసు ఈ మాటలను చెప్పి ముగించిన తర్వాత, ఆయన తన శిష్యులతో,
2
“మీకు తెలిసినట్లు, పస్కాకు ఇంకా రెండు రోజులున్నాయి, అప్పుడు మనుష్యకుమారుడు సిలువ వేయబడడానికి అప్పగించబడతాడు” అని చెప్పారు.
3
అప్పుడు ముఖ్య యాజకులు, ప్రజానాయకులు కలిసి కయప అనబడే ప్రధాన యాజకుని నివాసంలో సమావేశమయ్యారు.
4
వారు యేసును రహస్యంగా పట్టుకుని, చంపాలి అని కుట్రపన్నారు.
5
కాని పండుగ సమయంలో వద్దు, “జనాల మధ్య అల్లరి కలుగుతుందేమో” అని చెప్పుకున్నారు.
6
యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట్లో ఉన్నప్పుడు,
7
ఒక స్త్రీ చాలా ఖరీదైన పరిమళద్రవ్యం ఉన్న ఒక పాలరాతి సీసాను తెచ్చి, ఆయన భోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన తలమీద ఆ పరిమళద్రవ్యంను పోసింది.
8
శిష్యులు అది చూసి కోప్పడి, “ఇలా ఎందుకు వృధా చేయడం?” అని అడిగారు.
9
వారు, “ఈ పరిమళద్రవ్యాన్ని ఎక్కువ వెలకు అమ్మి ఆ డబ్బు పేదవారికి ఇచ్చి ఉండాల్సింది” అన్నారు.
10
యేసు ఆ సంగతి గ్రహించి వారితో, “ఈ స్త్రీని ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా కోసం ఒక మంచి కార్యం చేసింది.
11
పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, కాని నేను మీతో ఉండను.
12
ఈమె ఈ పరిమళద్రవ్యంను నా శరీరం మీద పోసి, నా భూస్థాపన కోసం నన్ను సిద్ధం చేసింది.
13
సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడినా, అక్కడ ఈమె చేసింది జ్ఞాపకం చేసుకుని, ఈమె చేసిన దాని గురించి కూడా చెప్పుకుంటారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను” అని వారితో అన్నారు.
14
అప్పుడు పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ముఖ్య యాజకుల దగ్గరకు వెళ్లి,
15
“నేను యేసును మీకు పట్టించడానికి నాకు ఏమి ఇస్తారు?” అని వారిని అడిగాడు. అందుకు వారు ముప్పై వెండి నాణాలు లెక్కపెట్టి వానికి ఇచ్చారు.
16
వాడు అప్పటినుండి ఆయనను అప్పగించడానికి తగిన అవకాశం కోసం ఎదురుచూశాడు.
17
పులియని రొట్టెల పండుగ మొదటి రోజున, శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “నీకోసం పస్కా భోజనం సిద్ధం చేయడానికి మమ్మల్ని ఎక్కడికి వెళ్లమంటావు?” అని అడిగారు.
18
అందుకు యేసు, “మీరు పట్టణంలో ఫలాన వ్యక్తి దగ్గరకు వెళ్లి, అతనితో, బోధకుడు ఇలా అన్నాడు: నా సమయం దగ్గరకు వచ్చింది. నేను నా శిష్యులతో కలిసి నీ ఇంట్లో పస్కాను ఆచరిస్తాను అని చెప్పమన్నాడు అని చెప్పండి” అన్నారు.
19
శిష్యులు వెళ్లి యేసు తమకు ఆదేశించిన ప్రకారం చేసి పస్కాను సిద్ధం చేశారు.
20
సాయంకాలమైనప్పుడు, ఆయన పన్నెండుమంది శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు.
21
వారు భోజనం చేస్తూ ఉండగా, ఆయన వారితో, “మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు” అని అన్నారు.
22
అందుకు వారు చాలా దుఃఖపడి, “ప్రభువా, నేనైతే కాదు కదా?” అని ఒకరి తర్వాత ఒకరు ఆయనను అడగడం మొదలుపెట్టారు.
23
అందుకు యేసు, “నాతో పాటు గిన్నెలో చేయి ముంచిన వాడే నన్ను అప్పగిస్తాడు.
24
మనుష్యకుమారుని గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం ఆయన వెళ్లిపోతారు. కాని మనుష్యకుమారుని పట్టించే వానికి శ్రమ! ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మేలు” అని అన్నారు.
25
అప్పుడు ఆయనను అప్పగించబోయే యూదా, “బోధకుడా, నేనైతే కాదు కదా?” అని అడిగాడు. అందుకు యేసు, “అలా నీవే చెప్పావు” అని జవాబిచ్చారు.
26
వారు భోజనం చేస్తున్నప్పుడు, యేసు ఒక రొట్టెను పట్టుకుని, దాని కోసం కృతజ్ఞతలు చెల్లించి, దానిని విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని తీసుకుని తినండి; ఇది నా శరీరం” అని చెప్పారు.
27
తర్వాత ఆయన పాత్రను తీసుకుని, కృతజ్ఞతలు చెల్లించి వారికి ఇచ్చి, “దీనిలోనిది మీరందరు త్రాగండి.
28
ఇది అనేకుల పాపక్షమాపణ కోసం నేను చిందించనున్న నా నిబంధన రక్తము.
29
నేను మీతో చెప్పేదేమనగా, నా తండ్రి రాజ్యంలో మీతో కూడ నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగే రోజు వరకు మళ్ళీ దీనిని త్రాగను.”
30
వారు ఒక కీర్తన పాడిన తర్వాత, ఒలీవల కొండకు వెళ్లారు.
31
అప్పుడు యేసు వారితో, “నన్ను బట్టి ఈ రాత్రి మీరందరు చెదరిపోతారు ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది: “ ‘నేను గొర్రెల కాపరిని కొడతాను, అప్పుడు మందలోని గొర్రెలు చెదిరిపోతాయి.’
32
కాని నేను తిరిగి లేచిన తర్వాత, మీకంటే ముందు గలిలయకు వెళ్తాను” అన్నారు.
33
అందుకు పేతురు, “అందరు నిన్ను విడిచి వెళ్లిపోయినా, నేను నిన్ను విడువను” అన్నాడు.
34
అందుకు యేసు అతనితో, “ఈ రాత్రి కోడి కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.
35
కాని పేతురు యేసుతో, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా, నీవెవరో నాకు తెలియదని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులందరు కూడా అలాగే అన్నారు.
36
ఆ తర్వాత యేసు తన శిష్యులతో కూడ గెత్సేమనే అనే చోటికి వెళ్లారు, ఆయన వారితో, “నేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చేవరకు మీరు ఇక్కడే కూర్చోండి” అని అన్నారు.
37
ఆయన పేతురును, జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖపడుతూ బాధపడసాగారు.
38
ఆయన వారితో, “నేను చనిపోయే అంతగా నా ఆత్మ దుఃఖంతో నిండి ఉంది, కాబట్టి మీరు ఇక్కడే ఉండి నాతో కలిసి మెలకువగా ఉండండి” అని చెప్పారు.
39
కొంత దూరం వెళ్లి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నెను నా దగ్గర నుండి తొలగిపోనివ్వు. అయినా నా చిత్తప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే జరిగించు” అని ప్రార్థించారు.
40
యేసు తిరిగి తన శిష్యుల దగ్గరకు వచ్చి, వారు నిద్రిస్తున్నారని చూసి పేతురుతో, “ఒక గంటయైనా నాతో మెలకువగా ఉండలేరా?” అని అడిగి,
41
“మీరు శోధనలో పడకుండ ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే, కాని శరీరం బలహీనం” అని చెప్పారు.
42
ఆయన రెండవసారి వెళ్లి ప్రార్థించారు, “నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే తప్ప ఇది నా దగ్గరి నుండి తొలగిపోవడం సాధ్యం కానట్లైతే, నీ చిత్తమే నెరవేర్చు.”
43
ఆయన తిరిగి వచ్చినప్పుడు, వారి కళ్లు బరువుగా ఉన్నాయి, కాబట్టి వారు మళ్ళీ నిద్రపోతున్నారని గమనించారు.
44
కాబట్టి ఆయన మరొకసారి వారిని విడిచివెళ్లి, ఆ మాటలనే పలుకుతూ మూడవసారి ప్రార్థించారు.
45
అప్పుడు ఆయన తన శిష్యుల దగ్గరకు తిరిగివచ్చి, “మీరు ఇంకా నిద్రిస్తు విశ్రాంతి తీసుకొంటున్నారా? చూడండి, మనుష్యకుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చేసింది.
46
వెళ్దాం రండి. నన్ను పట్టించేవాడు వస్తున్నాడు” అని చెప్పారు.
47
ఆయన ఇంకా మాట్లాడుతుండగా, పన్నెండుగురిలో ఒకడైన, యూదా వచ్చాడు. అతనితో పాటు ముఖ్య యాజకులు ప్రజానాయకులు పంపిన పెద్ద గుంపు కత్తులు కర్రలు పట్టుకుని వచ్చింది.
48
ఆయనను పట్టించేవాడు వారికి గుర్తులు చెప్పాడు, “నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో; ఆయనను మీరు బంధించాలి”
49
యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్లి, “బోధకుడా, నీకు శుభం” అని అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు.
50
అందుకు యేసు, “స్నేహితుడా, ఏమి చేయడానికి వచ్చావో అది చేయి” అన్నారు. అప్పుడు వారు ముందుకు వచ్చి, యేసును పట్టుకొని, ఆయనను బంధించారు.
51
అంతలో, యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు తన కత్తిని దూసి ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, వాని చెవిని నరికివేశాడు.
52
యేసు వానితో, “నీ కత్తిని దాని ఒరలో తిరిగిపెట్టు, ఎందుకంటే కత్తి ఉపయోగించేవాడు కత్తితోనే చస్తాడు.
53
ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే, ఆయన పన్నెండు దళాల సైన్యం కంటే ఎక్కువ మంది దూతలను వెంటనే నాకు పంపడని అనుకున్నావా?
54
కాని, ఈ విధంగా జరగాలని లేఖనాల్లో చెప్పబడినవి ఎలా నెరవేరుతాయి?” అని అన్నారు.
55
ఆ సమయంలోనే యేసు ఆ గుంపుతో, “నన్ను పట్టుకోడానికి కత్తులతో కర్రలతో వచ్చారు, నేను ఏమైన తిరుగుబాటు చేస్తున్నానా? నేను ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో కూర్చుని బోధించేటప్పుడు, మీరు నన్ను బంధించలేదు.
56
అయితే ప్రవక్తలు వ్రాసిన లేఖనాలు నెరవేరడానికే ఈ విధంగా జరిగింది” అని చెప్పారు. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయారు.
57
యేసును బంధించినవారు ఆయనను ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు తీసుకెళ్లారు, అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకులు యూదా నాయకులు సమావేశమై ఉన్నారు.
58
అయితే పేతురు ప్రధాన యాజకుని ఇంటి ప్రాంగణం వరకు, ఆయనను దూరం నుండి వెంబడిస్తూ వచ్చాడు. లోపల ఏమి జరుగుతుందో చూడాలని అక్కడే సైనికులతో కూర్చున్నాడు.
59
ముఖ్య యాజకులు న్యాయసభ సభ్యులందరు యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలను వెదకుతున్నారు.
60
చాలామంది అబద్ధ సాక్షులు ముందుకు వచ్చారు, కానీ వారికి ఏమి దొరకలేదు. చివరికి ఇద్దరు సాక్షులు ముందుకొచ్చారు.
61
వారిచ్చిన సాక్ష్యం ఏంటంటే, “ఈయన దేవాలయాన్ని పడగొట్టి, మూడు దినాల్లో దానిని లేపుతాను అని చెప్పాడు.”
62
అప్పుడు ప్రధాన యాజకుడు లేచి యేసుతో, “నీవు జవాబు చెప్పవా? నీకు వ్యతిరేకంగా వీరు చెప్తున్న ఈ సాక్ష్యం ఏమిటి?” అని అడిగాడు.
63
అయితే యేసు మౌనంగా ఉన్నారు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “జీవంగల దేవుని తోడని నిజం చెప్పు: ఒకవేళ నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే మాతో చెప్పు” అన్నాడు.
64
అందుకు యేసు, “నీవు చెప్పినట్లే. అయితే ఇప్పటినుండి మనుష్యకుమారుడు సర్వశక్తిగల దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉండడం ఆకాశ మేఘాల మీద ఆయన రావడం మీరు చూస్తారని మీ అందరికి చెప్తున్నాను.”
65
అప్పుడు ప్రధాన యాజకుడు తన వస్త్రాలను చింపుకొని, “వీడు దైవదూషణ చేశాడు! ఇంకా మనకు సాక్షులు ఏం అవసరం? చూడండి, ఇప్పుడే దైవదూషణ మీరు విన్నారు.
66
మీకు ఏమి అనిపిస్తుంది?” అని అడిగాడు. వారు, “ఇతనికి మరణశిక్ష విధించాలి” అని సమాధానం ఇచ్చారు.
67
అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి, ఆయనను వారి పిడికిళ్ళతో గుద్దారు, మరికొందరు ఆయనను తమ అరచేతులతో కొట్టి,
68
“క్రీస్తు, నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు” అన్నారు.
69
పేతురు బయట ప్రాంగణంలో కూర్చుని ఉన్నప్పుడు, అక్కడ ఒక దాసియైన అమ్మాయి అతని దగ్గరకు వచ్చింది. “నీవు కూడా గలిలయవాడైన యేసుతో ఉన్నవాడివే” అన్నది.
70
అయితే పేతురు అందరి ముందు తిరస్కరించి, “నీవు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు” అన్నాడు.
71
తర్వాత అతడు ద్వారం వైపు వెళ్లాడు, అక్కడ మరొక దాసియైన అమ్మాయి అతన్ని చూసి అక్కడ ఉండిన ప్రజలతో, “ఇతడు నజరేయుడైన యేసుతో ఉన్నవాడే” అని చెప్పింది.
72
పేతురు ఈసారి ఒట్టు పెట్టుకొంటూ, “అతడు నాకు తెలియదు” అని మళ్ళీ తిరస్కరించాడు.
73
కొంతసేపటి తర్వాత, అక్కడ నిలబడినవారు పేతురు దగ్గరకు వెళ్లి, “ఖచ్చితంగా నీవు కూడ వారిలో ఒకడివి; నీ మాట తీరే చెప్తుంది” అన్నారు.
74
అప్పుడు పేతురు శపించడం మొదలుపెట్టి, “అతని గురించి నాకు తెలియదు!” అని వారితో ప్రమాణం చేశాడు. వెంటనే కోడి కూసింది.
75
“కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదు అని మూడుసార్లు చెప్తావు” అని యేసు తనతో చెప్పిన మాటను పేతురు జ్ఞాపకం చేసుకుని బయటకు వెళ్లి ఎంతో బాధతో ఏడ్చాడు.
← Chapter 25
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 27 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28