bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
/
1 Kings 12
1 Kings 12
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
← Chapter 11
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 13 →
1
నెబాతు కుమారుడైన యరొబాము సొలొమోను నుండి తప్పించుకొని ఈజిప్టుకు పారిపోయాడు. అక్కడే వుండి పోయాడు. అతడు సొలొమోను మరణం గురించి విన్నప్పుడు, ఎఫ్రాయీము కొండలలో వున్న జెరేదా అను తన నగరానికి తిరిగి వచ్చాడు. రాజైన సొలొమోను చనిపోయి, తన పూర్వీకులతో పాటు సమాధి చేయబడిన పిమ్మట అతని కుమారుడు రెహబాము అతని స్థానంలో రాజయ్యాడు.
3
ఇశ్రాయేలు ప్రజలంతా షెకెమునకు వెళ్లారు. వారంతా రెహబామును రాజుగా చేయటానికి వెళ్లారు. రెహబాము కూడా రాజు కావటానికి షెకెమునకు వెళ్లాడు.
4
ప్రజలు రెహబాముతో, “నీ తండ్రి మమ్మల్ని బలవంతంగా భరింపరాని శరీర కష్టం చేయించాడు. కాని ఇప్పుడు నీవు మాకు శ్రమ తగ్గించాలి. నీ తండ్రి మాకు విధించిన శరీరకష్టం నీవు మాన్పించాలి. అప్పుడు మేము నీకు సేవ చేస్తాము” అని అన్నారు.
5
దానికి సమాధానంగా రెహబాము, “మూడు రోజుల తరువాత నా వద్దకు రండి. అప్పుడు మీకు నేను సమాధానం చెబుతాను” అని అన్నాడు. కావున ప్రజలంతా వెళ్లిపోయారు.
6
సొలొమోను జీవించి వున్నప్పుడు అతనికి పరిపాలనలో సహాయపడిన కొందరు పెద్దలైన సలహాదారులున్నారు. కావున రాజైన రెహబాము ఈ సందర్భంలో, “ఆ ప్రజలకు ఏమి చెప్పాలని మీరను కొంటున్నారు?” అని సలహా అడిగాడు.
7
పెద్దలు ఇలా అన్నారు, “ఈ రోజు నీవు వారి సేవకునిలా మెలగితే, రేపు వారంతా నిన్ను సేవిస్తారు. నీవు వారితో ప్రేమగా కనికరంతో మాట్లాడితే వారంతా నీ కొరకు ఎల్లప్పుడూ పనిచేస్తారు.”
8
కాని రెహబాము వారి సలహాను పెడచెవిని పెట్టాడు. తన స్నేహితులైన యువకులను సలహా అడిగాడు.
9
“నా తండ్రి ఇచ్చిన కఠినమైన పనికంటె తక్కువ పని ఇమ్మని ప్రజలు నన్నడుగుతున్నారు. నేనేమి సమాధానం చెపితే మంచిదని మీరనుకుంటున్నారు? నన్నేమి చెప్పమంటారు?” అని రెహబాము తన స్నేహితులను అడిగాడు.
10
రాజు యొక్క యువ స్నేహితులు, “ఆ ప్రజలు నీ వద్దకు వచ్చి, ‘నీ తండ్రి మమ్మల్ని బండ చాకిరి చేయటానికి బలవంతం చేశాడు. కనుక మా పనిని ఇప్పుడు సులభం చేయుము’ అని అడిగారు కదా! అయితే నీవిప్పుడు కొన్ని డంబాలు పలికి, ‘నా చిటికెనవేలు నా తండ్రి శరీరం కంటె పెద్దదిగా వుంది.
11
నా తండ్రి మిమ్మల్ని బండ చాకిరికి గురిచేశాడు. కాని నేను మిమ్మల్ని ఇంకా కష్టపడేలా చేస్తాను! నా తండ్రి మీచేత పని చేయించటానికి కొరడాలు ఉపయోగించాడు. కాని నేను పదునైన లోహపు ముక్కలతో కూర్చబడిన కొరడాలతో, మిమ్మల్ని చీల్చునట్లుగా కొడతాను’” అని సమాధానం చెప్పమన్నారు.
12
రెహబాము ప్రజలను, “మూడు రోజుల తరువాత తన వద్దకు రమ్మని” చెప్పాడు. కావున మూడు రోజుల తరువాత ఇశ్రాయేలీయులంతా రెహబాము వద్దకు వచ్చారు.
13
అప్పుడు రాజైన రెహబాము వారితో చాలా పరుషంగా మాట్లాడాడు. పెద్దలిచ్చిన సలహా రాజు పెడచెవిని పెట్టాడు.
14
తన యువ స్నేహితులు చెప్పినదే చేశాడు. రెహబాము వారితో, “నా తండ్రి మిమ్మల్ని హింసించి శరీర కష్టం చేయించాడు. కాని నేను మీకు ఇంకా కఠినమైన పని ఇస్తాను. నా తండ్రి మిమ్మల్ని కొరడాలతో కొట్టి పని చేయించాడు. కాని నేను మిమ్మల్ని ఎలా కొడతానంటే మీరు తేళ్లు కుట్టినట్లు బాధపడతారు!” అని చెప్పాడు.
15
కావున రాజు తన ప్రజలు కోరిన దానిని చేయలేదు. ఇదంతా యెహోవాయే తన చిత్తప్రకారం జరిపించాడు. తాను నెబాతు కుమారుడైన యరొబాముకు ఇచ్చిన వాగ్దాం నెరవేరేలాగున యెహోవా ఇది ఈ విధంగా జరిగేలా చేశాడు. షిలోహుకు చెందిన ప్రవక్త అహియా ద్వారా ఈ వాగ్దానం చేశాడు.
16
ఇశ్రాయేలీయులంతా కొత్త రాజు తమ అభ్యర్థన వినలేదని గమనించారు. అందువల్ల ప్రజలు ఇలా అన్నారు: “మనం దావీదు వంశానికి చెందినవారమా? కాదు, యెష్షయి రాజ్యంలో మనకేమైనా వస్తుందా? రాదు! కావున ఇశ్రాయేలు సోదరులారా, మనమంతా మన ఇండ్లకు పోదాం పదండి, దావీదు కుమారుణ్ణి తన ప్రజలను ఏలుకోనీయండి!” తరువాత ఇశ్రాయేలీయులందరూ తమ తమ ఇండ్లకు వెళ్లపోయారు.
17
అయినా రెహబాము యూదా నగరాలలో ఉన్న ఇశ్రాయేలీయులందరినీ ఏలాడు.
18
కూలిపని చేసే వారిపై అదోరాము అనునతడు అధికారిగా వుండేవాడు. రాజైన రెహబాము అదోరామును ప్రజలతో మాట్లాడేటందుకు పంపాడు. కాని ఇశ్రాయేలీయులు వానిని రాళ్లతో కొట్టి చంపేశారు. అది విని రాజైన రెహబాము తన రథమెక్కి యెరూషలేముకు తప్పించుకుపోయాడు.
19
అలా ఇశ్రాయేలీయులు దావీదు వంశంపై తిరుగుబాటు చేశారు. వారు ఈనాటికీ దావీదు వంశానికి వ్యతిరేకులుగానే వున్నారు.
20
యరొబాము తిరిగి వచ్చినట్లు ఇశ్రాయేలీయులు విన్నారు. కావున వారతనిని ఒక సభకు ఆహ్వానించి, ఇశ్రాయేలంతటికీ రాజుగా చేశారు. యూదాగోత్రం వారొక్కరు మాత్రమే దావీదు కుటుంబాన్ని అనుసరించారు.
21
రెహబాము యెరూషలేముకు తిరిగి వెళ్లాడు. అతడు యూదా గోత్రపువారిని బెన్యామీను గోత్రపు వారిని సమావేశపరిచాడు. వారిని ఒక లక్షా ఎనుబదివేల మందిగల ఒక సైన్యంగా తయారు చేశాడు. రెహబాము ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయ సంకల్పించాడు. తన రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని అతని కోరిక.
22
కాని యెహోవా ఒక దైవజ్ఞుని (ప్రవక్త) తో మాట్లాడాడు. అతని పేరు షెమయా. యెహోవా ఆ ప్రవక్తతో ఇలా అన్నాడు:
23
“నీవు వెళ్లి సొలొమోను కుమారుడు, యూదా రాజు అయిన రెహబాముతోను, మరియు యూదా బెన్యామీను ప్రజలతోను మాట్లాడు.
24
మీ సోదరుల మీదికి మీరు యుద్ధానికి వెళ్లవద్దని నా మాటగా వారికి చెప్పు ‘మీలో ప్రతి ఒక్కడూ ఇంటికి వెళ్లాలి. ఇవన్నీ జరిగేలా నేనే చేశాను.’ ఈ విషయం యెహోవా మీకు తెలియ చేయమన్నాడని చెప్పు.” ప్రవక్త వెళ్లి చెప్పగా రెహబాము సైన్యంలోని వారంతా విని యెహోవా ఆజ్ఞ శిరసాపహించారు. వారు ఇండ్లకు వెళ్లారు.
25
యరొబాము తరువాత షెకెమును చాలా బలమైన నగరంగా తీర్చిదిద్దాడు. ఆ నగరం ఎఫ్రాయీము కొండలలో వుంది. యరొబాము అక్కడ నివసించాడు. అతడు పెనూయేలు అను నగరానికి వెళ్లి దానిని కూడ మంచి పటిష్ఠమైన నగరంగా చేశాడు.
26
యరొబాము ఇలా అనుకున్నాడు: “ఇప్పుడు ప్రజలంతా యెరూషలేములో యెహోవా దేవాలయానికి యథాప్రకారంగా వెళుతూ వుంటే, వారు దావీదు వంశం వారిచే పాలింపబడాలని అనుకుంటారు. యూదా రాజైన రెహబామునే వారు మళ్లీ అనుసరించవచ్చు. ఆ తరువాత వారు నన్ను చంపనూవచ్చు.”
28
అందువల్ల తాను ఏమి చేయాలో తెలియజేయమని రాజు తన సలహాదారులను అడిగాడు. వారి సలహామేరకు అతడు రెండు బంగారు కోడెదూడలను చేయించాడు. రాజైన యరొబాము ప్రజలనుద్దేశించి, “మీరు దేవుని ఆరాధించేందుకు యెరూషలేముకు వెళ్లవద్దు. ఇశ్రాయేలీయులారా, ఇవిగో మిమ్మల్ని ఈజిప్టునుండి తీసుకుని వచ్చిన దేవతలు ఇవే” అని అన్నాడు.
29
అలా అని రాజైన యరొబాము ఒక బంగారు కోడెదూడ బొమ్మను బేతేలునందును, రెండవ దానిని దాను నగర మందును ప్రతిష్ఠించాడు.
30
కాని ఇది ఘోరమైన పాపం. ప్రజలు బేతేలు, దాను నగరాలకు ప్రయాణమై కోడెదూడల విగ్రహాలను ఆరాధించటం మొదలు పెట్టారు.
31
గుట్టల మీద, కొండల మీద యరొబాము ఆరాధనా స్థలాలను కట్టించాడు. వివిధ వంశాల నుండి యాజకులను ఎంపిక చేశాడు. (కేవలం లేవీయులనుండి మాత్రమే అతడు యాజకులను ఎంపిక చేయలేదు).
32
రాజైన యరొబాము ఒక కొత్త పండుగరోజు ప్రకటించాడు. ఇది పస్కా పండుగ వంటిది. అది ఎనిమిదవ నెలలో పదునైదవ రోజు. (ఒకటవ నెల పదిహేనవ రోజున కాదు). యూదాలో బేతేలు నగరంలో వున్న పీఠం వద్ద ఆ రోజున రాజు బలులు సమర్పించాడు. తాను తయారు చేయించిన దూడల బొమ్మలకు రాజు బలులు అర్పించేవాడు. తను ఏర్పాటు చేసిన దేవాలయాలలో సేవ చేయటానికి రాజైన యరొబాము యాజకులను బేతేలు నుండి కూడ తీసుకున్నాడు.
33
కావున రాజైన యరొబాము ఇశ్రాయేలీయులకు పండుగ నిమిత్తం తనకు అనుకూలమైన రోజును మాత్రమే నిర్ణయించాడు. అది ఎనిమిదవ నెలలో పదునైదవ రోజు. ఆ సమయంలో అతను నిర్మించిన బలిపీఠాల వద్ద అతడు బలులు సమర్పించి, ధూపం వేసేవాడు. (ఈ కార్యాలు) అతను బేతేలు నగరంలో నిర్వహించేవాడు.
← Chapter 11
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 13 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22